వాట్సప్ గ్రూప్లో తేడా వస్తే.. జైలే.. ‘నేను చేయలేదు’ అంటే కుదరదు
షేర్ చేయకూడని అంశాలు
తెలియని సమాచారం
తప్పుడు సమాచారం
తప్పుదారి పట్టించేవి
విద్వేషాలు రెచ్చగొట్టేవి
వివాదాలకు కారణమయ్యేవి
వర్గపోరుకు దారితీసేవి
కించపరిచేవి.. అసభ్యకరమైనవి
వదంతులు.. తప్పుడు వార్తలు
మార్ఫింగ్ చేసిన ఫొటోలు
గ్రూప్లో ఎవరు తప్పు చేసినా బాధ్యత అడ్మిన్దే
దోషిగా తేలితే.. 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష
చేతిలో ఫోన్.. చౌకగా ఇంటర్నెట్.. ఉచితంగా వాట్సప్ ఉంది కదా.. అని నాలుగు గ్రూప్లు క్రియేట్ చేసి వాటికి అడ్మిన్ అయి ఏదో ఘనకార్యం చేసినట్లు భావిస్తున్నారా..! అయితే జాగ్రత్త..! మీరు సృష్టించిన గ్రూప్లో ఎవరో.. ఏదో తేడా చేశారనుకోండి.. ఆ పాపం మీ మెడకూ చుట్టుకుంటుంది. వివాదాస్పద.. అసభ్య పోస్ట్ చేసిన సభ్యుడితో పాటు మీరూ.. మూడు నుంచి ఐదేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. అదేంటి.. ఎవరో.. ఏదో పోస్ట్ చేస్తే.. అడ్మిన్కి ఏం సంబంధం అంటారా..! ఉంది. అందుకే.. ఇటీవల కర్ణాకటలో ‘బాల్సేబాయ్స్’ అనే గ్రూప్లో కొందరు సభ్యులు ప్రధాని మోదీ చిత్రాన్ని అసభ్యకరంగా ‘మార్ఫే’సి పోస్ట్ చేయగా.. చివరకు అడ్మిన్ కూడా కటకటాలపాలయ్యాడు. ఇలా వాట్సప్ గ్రూప్ అడ్మిన్ను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. వాట్సప్.. ఫేస్బుక్లలో గ్రూప్ల వల్ల దేశంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ప్రస్తుతం అన్ని ప్రభుత్వాలనూ హెచ్చరిస్తున్నాయి. వదంతులు.. తప్పుడు వార్తల వ్యాప్తికి ఇవే కారణమవుతున్నాయని గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు వాట్స్ప..ఫే్సబుక్ ఇతర గ్రూప్లను కట్టడిచేసే పనిలో పడ్డారు. గ్రూపుల ద్వారా అసభ్యకర, తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాట్సప్లో వివాదాస్పద పోస్ట్లు రాకుండా.. ఆయా గ్రూపుల అడ్మిన్లను కూడా బాధ్యులను చేస్తున్నారు. ఒక్క జమ్మూ కశ్మీర్లోనే 500పైగా వాట్సప్ గ్రూపులు సైనికులపైకి రాళ్లు విసిరేందుకు అక్కడి యువతను ప్రోత్సహించినట్లు పోలీసులు గుర్తించి వాటిని ఇప్పుడు బంద్ చేస్తున్నారు. మొత్తానికి వాట్సప్.. గ్రూప్కి అడ్మిన్ అంటే ఇప్పుడు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎవరో ఏదో షేర్ చేశారు కదా.. అని అది అసలో కాదో ధ్రువీకరించుకోకుండా మళ్లీ షేర్ చేస్తే ఇబ్బందుల్లో పడ్డట్లే. గ్రూప్లో పెడితే గ్రూప్ సభ్యులకు తప్ప.. ఇతరులకు తెలియదు.. అనుకోవడం భ్రమ. గ్రూప్లో ఇతరులు దీన్ని మరో గ్రూప్లలో షేర్ చేస్తారు. ఇలా గొలుసుకట్టు షేర్లలో అది కొన్ని గంటల్లోనే ఊహకు కూడా అందనంత మందికి చేరిపోతుంది. వీరిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కేసు మొదటి గ్రూప్ అడ్మిన్ వరకూ రావొచ్చు. ఆ పోస్ట్ను సృష్టించిన వారితో పాటు అడ్మినూ చిక్కుల్లోపడతాడు. అందువల్ల గ్రూప్ అడ్మిన్లు కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు.. నిపుణులు సూచిస్తున్నారు. ఏ లక్ష్యం .. లేదా అంఽశంపై గ్రూప్ క్రియేట్ చేశారో.. దానిపైనే పోస్టులను అనుమతించాలి తప్ప.. ఇతర వివాదాస్పద పోస్టులు.. వ్యాఖ్యలను అనుమతించవద్దని సూచిస్తున్నారు. సాధారణంగా ఏవైనా నేరాలు జరిగితే.. వాటికి పక్కా ఆధారాలు సేకరించడం కష్టం. కానీ సోషల్ మీడియా.. వాట్సప్ గ్రూప్లలో.. తేడా చేస్తే.. పక్కా ఆధారాలు సేకరించడం పెద్ద సమస్య ఏమీ కాదు. కొన్ని గంటల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి దోషిగా నిలబెట్టవచ్చని పోలీసులు అంటున్నారు. అందువల్ల ఫేస్బుక్లోకానీ.. వాట్సప్లోకానీ.. గ్రూప్ క్రియేట్ చేసే ముందు.. సభ్యులను ఆహ్వానించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.
సాధారణ ఫొటో పెట్టినా నేరమే..!!
వాట్సప్ లో గ్రూప్లో ప్రతి పోస్ట్కీ అడ్మిన్దే బాధ్యత అని తెలుగు రాష్ర్టాల పోలీసులు అంటున్నారు. పార్టీలు..ఇతర ప్రాంతాల్లో ఫొటోలను కూడా అవతలివారి అనుమతి లేకుండా తీసి.. వాట్స్పలో పంచుకోవడం సరికాదని చెబుతున్నారు. ఇది అవతలి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తుంది కనుక.. వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కటకటాలపాలుకాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎదుటి వ్యక్తుల ఇష్టం లేకుండా.. వారి ఫొటోను సోషల్ మీడియాలోనో.. వాట్స్పలోనో షేర్ చేయడం ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం నేరమవుతుందని తెలిపారు.
వారణాసి కలెక్టరు, ఎస్పీ విడుదల చేసిన నోటీసు ప్రకారం
అడ్మిన్ బాధ్యతలు
వాట్సప్.. ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ పరిపక్వతతో ఆలోచించగలిగినవాడై ఉండాలి. గ్రూప్లో ప్రతి పోస్ట్కీ.. బాధ్యత తీసుకోవాలి.
గ్రూప్లో యాడ్ చేసే ప్రతి సభ్యుడూ అడ్మిన్కు తెలిసి ఉండాలి.
ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే.. వెంటనే గ్రూప్ నుంచి తొలగించాలి
సదరు అసభ్య సమాచారం.. తప్పుడు వార్త.. వదంతిపై స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి
ఆ వివాదాస్పద పోస్టింగ్కి సబంధించి అడ్మిన్ ఏం చర్యలూ తీసుకోకుంటే.. అతనిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు
అడ్మినే వివాదాస్పద పోస్ట్ చేస్తే.. ఐటీ చట్టం, ఐపీసీ సెక
